గజ్వెల్, నవంబర్ 14: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేకర్ రావు నామినేషన్ వెయ్యడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం గజ్వెల్ లో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. దానికంటే ముందు తనకు సెంటిమెంట్, ఇష్ట దైవమైనా సిద్దిపేటలోని కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజల చేయనున్నారు.ఉదయం 9 గంటలకు కేసీఆర్ కోనాయిపల్లికి చేరుకుని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. నామినేషన్ పత్రాలను స్వామి వారి చెంత ఉంచి పూజలు చేసిన తర్వాత ఆలయంలోనే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేస్తారు.
మధ్యాహ్నం 2.34 గంటల సమయంలో సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు. 1985 నుంచి ప్రతి ఎన్నిక సందర్భంగా కేసీఆర్ కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ దాఖలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. కేసీఆర్ రాక సందర్భంగా కోనాయి పల్లిలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. కేసీఆర్ తో పాటు నాటి నుంచి తన వెంట హరీశ్ రావు వుండటం కూడా సెంటిమెంట్ గా ఉండటంతో హరీశ్ రావు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నామినేషన్ వేయడానికి కేసీఆర్ ర్యాలీగా వెళ్లనున్నారు. ఆయన వెంట కనీసం లక్ష మంది కార్యకర్తలు పాల్గొననున్నట్లు సమాచారం