హైదరాబాద్ ,నవంబర్ 14: సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ల హవా నడుస్తోంది. ఇప్పటికే క్రీడాకారులకు సంబంధించి ‘మేరీ కోమ్ , ‘ఎమ్.ఎస్. ధోనీ , ‘సచిన్ తదితర సినిమాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ను చిత్రీకరిస్తున్నారు . మరోపక్క ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా సినిమా రాబోతోంది. ప్రముఖ హీరో సుధీర్బాబు ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ సినిమా రాబోతోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ అబన్డన్షియ ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
పుల్లెల గోపీచంద్ పాత్ర కోసం సిద్ధమౌతున్నట్లు సుధీర్ మంగళవారం సోషల్మీడియాలో పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ సాధన చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ ఆట తన తొలిప్రేమని ట్వీట్ చేశారు. ‘తిరిగి నా తొలి ప్రియురాలు (బ్యాడ్మింటన్) దగ్గరికి వచ్చా.. తొలి ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుందని అందరూ అంటుంటారు (సరదాగా). పుల్లెల గోపీచంద్కు సిద్ధమౌతున్నా అని అన్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎటువంటి స్పందనలేదు.