కాంగ్రెస్ రెబెల్స్.. మోత మోగిస్తున్నారు..

     Written by : smtv Desk | Wed, Nov 14, 2018, 07:27 PM

కాంగ్రెస్ రెబెల్స్.. మోత మోగిస్తున్నారు..

హైదరాబాద్ ,నవంబర్ 14: తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో వేడి రాజుకుంటోంది. టీఆర్ ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహా కూటమిలో మిత్ర పక్షాలకు సీట్ల పంపకం పోనూ మిగతా 94 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నామినేషన్లకు దగ్గర పడుతున్నవేళ ఎట్టకేలకు విడుదలైన జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు గెలుపు అవకాశాలను సమీక్షించుకుంటుండగా - టిక్కెట్ ఆశించి భంగపడిన అభ్యర్థులు నైరాశ్యంలో మునిగిపోయారు. కొందరు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటుండగా మరికొందరు అధిష్టానంపై తిరుగుబాటుబావుటా ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు.

15–20 చోట్ల కాంగ్రెస్ కు - కూటమి పార్టీలకు అసమ్మతి సెగ తగిలేట్టు కనిపిస్తోంది. చివరి క్షణం వరకు ఎదురు చూసిన నేతలంతా ప్రత్యామ్నాయ పార్టీలను వెతుక్కుంటున్నారు. బీజేపీ - బీఎస్పీ - ఎన్సీపీ - ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీల బీ–ఫారాల మీద పోటీ చేయాలనే ఆలోచనలో ఇంకొందరున్నారు. కొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా మారి స్వతంత్రులుగా బరిలో దిగబోతున్నారు. టీడీపీ ప్రకటించిన 9 స్థానాల్లోనూ అసంతృప్తులు ఉండటం గమనించదగ్గ విషయం. కాగా పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన అభిమాని మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కరీంనగర్ జిల్లా వేములవాడ టికెట్ను ఆది శ్రీని వాస్కు కేటాయించడంపై ఏనుగు మనోహర్ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మనోహర్రె డ్డి బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. చొప్పదండిలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన కూడా రెబెల్ గా బరిలో ఉండే అవకాశాలున్నాయి. వరంగల్ వెస్ట్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంపై డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. లేదంటే ఇండిపెండెంట్ గా బరిలో నిలిచే అవకాశముంది.

స్టేషన్ ఘన్ పూర్ లో మాజీమంత్రి విజయరామారావు వర్గం అసంతృప్తితో ఉంది. ఆయన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పాలకుర్తిలో సుధీర్ రెడ్డి కూడా రెబెల్ గా పోటీ చేయనున్నారు. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతియాదవ్ రెబెల్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇదే స్థానంలో టీడీపీ టికెట్ను భవ్య ఆనంద ప్రసాద్ కు కేటాయించడంపై సొంత పార్టీ నేతలే ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ టికెట్ ఆశించిన మొవ్వా సత్యనారాయణ అనుచరులు మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు హల్ చల్ చేశారు.

కంటోన్మెంట్ లో సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిశాంక్ రెబల్ గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. టీపీసీసీ కార్యదర్శి గణేశ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఇండిపెండెంట్ గా బరిలో దిగుతున్నానని ప్రకటించారు. ముషీరాబాద్ లో నగేశ్ ముదిరాజ్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాలమూరు జిల్లాలో టీడీపీకి కేటాయించిన మక్తల్ - మహబూబ్ నగర్ స్థానాల్లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులుగా మక్తల్లో శ్రీహరి - మహబూబ్ నగర్ లో సురేందర్ రెడ్డి బరిలో ఉండే అవకాశాలున్నాయి. మంచిర్యాల టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పోటీ చేస్తానని అంటున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పార్టీకి రాజీనామా చేశారు. చేవెళ్లలో డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి - వికారాబాద్ లో మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్ కూడా రె‘బెల్స్ మోగించాలనుకుంటున్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట టీడీపీకి కేటాయించగా కాంగ్రెస్ అభ్యర్థిగా సున్నం నాగమణి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. కొత్తగూడెంలో ఎడవెల్లి కృష్ణ కూడా పోటీ చేసే అవకాశాలున్నాయి.

నల్లగొండ జిల్లా కోదాడ స్థానాన్ని పద్మావతికి కేటాయించగా - కూటమి పక్షాన టికెట్ ఆశించిన బొల్లం మల్లయ్య యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సూర్యాపేట టికెట్ ఆశించిన పటేల్ రమేశ్ రెడ్డి నిర్ణయం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో బాన్సువాడ - జుక్కల్ స్థానాల్లో రెబెల్ అభ్యర్థులు బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి.





Untitled Document
Advertisements