హైదరాబాద్ ,నవంబర్ 14: బాలీవుడ్ ప్రేమజంట దీపిక పదుకొణె, రణ్వీర్ సింగ్ పెళ్లి బంధంతో వొక్కటయ్యారు. ఇటలీలోని లేక్ కోమోలో వీరి వివాహం ఈరోజు కొంకణి సంప్రదాయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పెళ్లి తంతు సాయంత్రం 3 గంటలకుపూర్తి అయినట్లు తెలుస్తోంది. వేడుక నిమిత్తం వరుడు రణ్వీర్ తన బంధు మిత్రులతో కలిసి సీప్లేన్లో మండపానికి వచ్చారట. ఇదే రోజున వీరిద్దరి నిశ్చితార్థ వేడుకను కూడా నిర్వహించారు. రణ్వీర్ తన మోకాలిపై కూర్చుని కాబోయే భార్య వేలికి ఉంగరం తొడుగుతున్నప్పుడు దీపిక ఉద్వేగానికి లోనయ్యారని బాలీవుడ్ వర్గాల సమాచారం. అప్పుడు రణ్వీర్ ఆమెను ప్రేమగా అక్కున చేసుకుని బుజ్జగించారట.
పెళ్లికి దీపిక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన చీరను ధరించినట్లు తెలుస్తోంది. లేక్ కోమో తీరంలో ఏర్పాటుచేసిన వివాహ విందు ఫొటోలు, పెళ్లిదుస్తుల్లో రణ్వీర్, దీపిక ఉన్న ఫొటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి జరిగే ప్రాంతం వద్ద భారీ సెక్యూరిటీని పెట్టారు . వివాహానికి వచ్చే అతిథులు తప్పకుండా శుభలేఖలు తీసుకురావాలని, చేతికి రిస్ట్ బ్యాండ్స్ ధరించాలని నిబంధనలు విధించారు. గురువారం సింధి సంప్రదాయంలో మరోసారి దీపిక, రణ్వీర్ వివాహం జరుగుతుంది. ఈ నెల 21న బెంగళూరులో, 28న ముంబయిలో వివాహ విందును ఏర్పాటుచేయనున్నారు.