హైదరాబాద్, నవంబర్ 14: మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఖరారు అయినట్లు కె జానారెడ్డి చెప్పిన అనంతరం తొలి జాబితాలో అతని పేరు లేకపోవడంతో నిన్న ఉదయం ఢిల్లీ వెళ్లి మల్లీ తన సీటు ఖారారు చేసుకున్న విషయం తెలిసిందే . అయితే ఇవ్వాళా ్రకటించిన రెండవ జాబితాలో కూడా పొన్నాల పేరు లేకపోవడంతో జనగామలో ఆయన అనుచరులు రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. పొన్నాలకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా జనగామలో 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. పొన్నాలకు టికెట్ కేటాయించకపోతే జనగామ నుంచి మహాకూటమి తరపున ఎవరు పోటీ చేసినా ఓడించి తీరుతామని హెచ్చరించారు.
మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లలో భాగంగా జనగామను తెలంగాణ జనసమితికి కేటాయించబడిందని, అక్కడి నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ పోటీ చేయబోతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ బీసీ నేత అయిన పొన్నాల తన వలన నష్టపోతారనే కారణంతో కోదండరామ్ జనగామ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకొన్నట్లు వార్తలు వచ్చాయి. కనుక పొన్నాలకు కాంగ్రెస్ పార్టీ జనగామ టికెట్ ఖరారు చేసినట్లు మంగళవారం సాయంత్రం మీడియాలో వార్తలు వచ్చాయి. ఈరోజు ప్రకటించే జాబితాలో పొన్నాల పేరు తప్పకుండా ఉంటుందని అందరూ భావిస్తే ఆయన పేరు కనబడలేదు.
దీనిపై ఆయన అనుచరులే కాకుండా రేణుకా చౌదరి వంటి సీనియర్ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడుగా పనిచేసిన పొన్నాల వొకప్పుడు తన చేతులతో కాంగ్రెస్ అభ్యర్ధులకు టికెట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు తన టికెట్ కోసం డిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసివస్తోంది. పొన్నాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందో లేదో తేల్చి చెప్పకపోవడంతో ఆయన, అనుచరులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.