విజయనగరం, నవంబర్ 21: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 302 రోజుల ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ "ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధలు, వారి సమస్యలు పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై పోరాటం చేస్తానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, రాష్ట్ర సమస్యలను వదిలేసి పక్క రాష్ట్ర నేతలతో భేటీలవుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని బాబు పై మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుంటే పట్టించుకోని ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ డ్రామాలు ఆడుతున్నారని, చంద్రబాబు చేసిన అవినీతి బయటపడకుండా కాపాడుకునేందుకే సీబీఐ ప్రవేశాన్ని రద్దు చేస్తూ జీవో తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబుపై విచారణ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇస్తే.. ఏపీకి హైకోర్టు కూడా అవసరం లేదని జీవో ఇచ్చినా ఇచ్చేస్తారని ఎద్దేవా చేశారు.
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా తమ పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబు కురుపాం ఎమ్మెల్యే పుష్పవాణినిని ప్రలోభపెట్టారు. కానీ పుష్పవాణి మాత్రం ఎన్ని ప్రలోభాలు పెట్టినా విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయంలోనే కురుపాం అభివృద్ధి చెందిందని ఎందరికో ఇళ్లను నిర్మించి ఇచ్చారని కానీ చంద్రబాబు పాలనలో ఊరికి నాలుగైదు ఇళ్లను కూడా ఇవ్వలేదని, వైఎస్ రాజశేకర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు పరుగులు పెట్టించారు. ఆయన హయంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక తోటపల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేద’ని వైఎస్ జగన్ ఆరోపించారు.