న్యూ ఢిల్లీ, నవంబర్ 22: తెలంగాణ శాసనమండలి ఎన్నికల సందర్భంగా రూ.50 లక్షల నగదుతో నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను కలిసిన డీల్ వీడియో, ఆడియో క్లిప్పులు బయటకు రావడంతో కేసు నమోదు కావడం తెలిసిందే. అయితే ఈ కేసులో A-4 ముద్దాయిగా ఉన్న జరూసలేం మత్తయ్య ఈ రోజు సుప్రీం కోర్టులో సంచలన ఆరోపణలు చేశాడు. తన ఇంటి చుట్టూ పోలీసులు 24 గంటలపాటు తిరుగుతూ తనతోపాటు తన భార్యాపిల్లను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ‘ఈ కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కుమ్మక్కయి నన్నున వేధిస్తున్నాయి. అప్రూవర్ గా మారిన నాకు రక్షణ లేకుండా పోయింది.
ఏపీ, తెలంగాణ పోలీసులు వేధిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల పోలీసుల విచారణపై నమ్మకం లేదు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించండి…’ అని విన్నవించుకున్నాడు. ఈ కేసులో కోర్టే చొరవ తీసుకొని వొక న్యాయవాదిని కేటాయించాలని కోరాడు. దీంతో సుప్రీం కోర్టు మత్తయ్యకు అమికస్ క్యూరీగా సిద్ధార్థ్ ధవేను నియమించింది. అలాగే మత్తయ్యకు తెలంగాణ డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలని ఆదేశిస్తూ కేసు విచారణను జనవరి 29కి వాయిదా వేసింది.