అమరావతి, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని వైఎసార్సీ అధికార ప్రతినిధి రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు పాలనపై నలుగురు మాజీ సిఎస్లు ఆరోపణలు చేశారంటేనే ఎంతలా అవినీతి జరిగిందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుంటే ఆయన పక్కన ఎవరూ కూర్చోరని విమర్శించారు.
ఒక్కసారి వామపక్షాలు, మరోసారి జనసేన , ఇంకోసారి బిజెపి చివరగా కాంగ్రెస్తో కూడా పొత్తు కుదుర్చుకున్నారన్నారు. అవసరాల కోసం చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతారని త్రీవ్ర విమర్శలు సంధించారు . ఉపాధి హామీ పనుల్లో రూ.7000కోట్లు మింగేశారని ఆరోపించారు. రూ.450కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకే బినామీలకు ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతిని కాగ్ తన నివేదికను బట్టబయలు చేసిందన్నారు. ఓటమి భయంతోనే నీచంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు, ఆయనతో నడిచే పార్టీలకు ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు.