జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి కేసుల దర్యాప్తుతో రెండు తెలుగు రాష్ట్రాలలో వెలుగులోకి వచ్చిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఈనెల 26వ తేదీన ఒక కొత్త రాజకీయ పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నట్లు తాజా సమాచారం. అదే రోజున ఆయన తన పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం అయ్యే అవకాశం ఉంది.
బహుశః కొత్త పార్టీని స్థాపించే ఉద్దేశ్యంతోనే ఆయన ఆరు నెలల ముందుగా పదవీ విరమణ చేసి ఏపీలో విస్తృతంగా పర్యటిస్తూ రైతులు, యువత, వివిద వర్గాల ప్రజలను కలుస్తూ వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారని భావించవలసి ఉంటుంది. వ్యవసాయం, విద్యా, వైద్య, ఉద్యోగ ఉపాది రంగాలపై ఆయన ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. తన ఆశయాలను సాకారం చేసుకోవడానికి సహకరించే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తానని ఆయన చెప్పినప్పటికీ, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలతో అది సాధ్యం కాదని భావించిన అయన స్వయంగా రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్దం అవుతున్నట్లున్నారు. ఒకవేళ ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినట్లయితే ఏపీలో ఆయన పార్టీ అధికారంలోకి రాలేకపోయినా టిడిపి, వైకాపా, జనసేన, బిజెపి ఓట్లను తప్పకుండా చీల్చగలరు కనుక ఆ నాలుగు పార్టీలకు ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది.