జైసల్మేర్, నవంబర్ 23: రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ నగరంలో జరగనున్న పారిశ్రామికవేత్త వివాహానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, తన భర్త జరేడ్ కుష్నర్ తో కలిసి రానున్నట్లు తాజా సమాచారం. ఈ నెల 22 నుంచి 25 తేదీల మధ్య జరిగే ఓ బడా ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్త వివాహ కార్యక్రమంలో ఇవాంకా దంపతులు పాల్గొంటారని అధికారులకు సమాచారం అందింది. అమెరికా రాయబార కార్యాలయానికి ఇవాంకా పర్యటనపై ఎలాంటి అధికారిక సమాచారం రాకున్న రాజస్థాన్ అధికారులు మాత్రం ఇవాంకా పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన 50 మంది అధికారులు జైసల్మేర్ వచ్చి భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక ఛార్టర్డ్ విమానంలో ఇవాంక దంపతులు వస్తారని అదనపు ఎస్పీ రాజీవ్ దుత్తా తెలిపారు. ఇవాంకా దంపతులు పారిశ్రామికవేత్త వివాహ కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఇక్కడే బసచేసి 25వ తేదిన అమెరికా తిరిగి వెళతారని దుత్తా వివరించారు.