హైదరాబాద్, నవంబర్ 24: రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు లక్ష్మీనారాయణ అంటే ఎవరో తెలియకపోవచ్చు కానీ ‘జెడి లక్ష్మీనారాయణ’ అంటే అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. అయితే జెడి అనేది ఆయన ఇంటిపేరు కాదు. సిబిఐలో పనిచేసినప్పుడు ఆయన పదవి (జాయింట్ డైరెక్టర్) అది. కానీ చివరికి అదే ఆయన ఇంటిపేరుగా మారిపోవడం విశేషమే.
ఆయన ఈనెల 26వ తేదీన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ‘జెడి లక్ష్మీనారాయణగా’ తనకు ప్రజలలో ఉన్న మంచి గుర్తింపును వాడుకోవాలనే ఉద్దేశ్యంతో తన పార్టీకి కూడా జెడి అంటే ‘జనధ్వని’ అనే పేరును ఆయన ఎంచుకొన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో ఆయన తన పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యువతను, విద్యావేత్తలను, మేధావులను ఆహ్వానించినట్లు సమాచారం. ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉంది కనుక ఆలోగా ఏపీలో తన పార్టీ నిర్మాణం చేసుకొని ఎన్నికలలో పాల్గొనాలని ‘జెడి’ లక్ష్మీనారాయణ భావిస్తున్నారు.