ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్(51) ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు సమాచారం. 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో పూణె లోక్సభ స్థానం నుంచి ఆమెను బరిలోకి దించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్దమైంది. ఈ ఏడాది జూన్లో సంపర్క్ ఫర్ సమర్ధన్ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్షా మాధురీ దీక్షిత్ ఆమె నివాసంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బిజెపి చేపట్టిన కార్యక్రమాలు ,మోది ప్రభుత్వ అభివృద్దిని వివరించారు. పూణె లోక్సభ స్థానానికి చేసిన షార్ట్లిస్టులో మాధురీ దీక్షిత్ పేరు ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఆమె పోటీలోకి దించే విషయంలో పార్టీ చాలా సీరియస్గా ఉందన్నారు.తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ సీనియర్ నేత పీటీఐతో మాట్లాడుతూ, పూణె స్థానానికి సంబంధించి మాధురీ దీక్షిత్ పేరును ఖరారు చేసినట్టు తెలిపారు. ఆమెకు పూణె నియోజకవర్గం సరిగ్గా సరిపోతుందని చెప్పారు. ఎన్నికల్లో కొత్తవారిని బరిలోకి దింపడం వల్ల ఉపయోగం ఉంటుందని... వారిని విమర్శించడానికి విపక్షాలకు ఎలాంటి ఆయుధాలు దొరకవని తెలిపారు.