డీఎస్పీని బురిడీ కొట్టించిన ఆకతాయి..!

     Written by : smtv Desk | Thu, Dec 06, 2018, 06:10 PM

డీఎస్పీని బురిడీ కొట్టించిన ఆకతాయి..!

నంద్యాల,డిసెంబర్ 6: మాములుగా స్కూల్లోగాని, రైలు లేదా విమానంలో బాంబు ఉందని ఆకతాయిలు అధికారులకు ఫోన్ చేసి ఆట పట్టిస్తుంటారు. కానీ నంద్యాలలో ఓ వ్యక్తి ఏకంగా డీఎస్పీకి ప్రాంక్ కాల్ చేసి ముప్పతిప్పలు పెట్టాడు. దీంతో పోలీస్ అధికారులు సదరు ప్రబుద్ధుడి కోసం కొంచెం గట్టిగానే గాలింపు చేపట్టారు.

నంద్యాల నగర డీఎస్పీ గోపాలకృష్ణకు నిన్న ఓ ఆకతాయి ఫోన్ చేసి ‘సార్.. నంద్యాల దగ్గర ఉన్న పెద్దకొట్టాల గ్రామంలో ఓ ఇంట్లో రూ.200 కోట్లు దాచి ఉంచారు. మీరు వచ్చి వెంటనే స్వాధీనం చేసుకోండి. వీళ్లు ఈ మొత్తాన్ని మరో చోటుకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. త్వరగా రండి సార్ అంటూ పేరు చెప్పకుండానే కాల్ కట్ చేశాడు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈ సమాచారం నిజమై ఉంటుందని నమ్మిన డీఎస్పీ.. నంద్యాల అర్బన్ సీఐ రవిశంకర్ రెడ్డి, పోలీసులు, రెవిన్యూ అధికారులతో కలిసి వొక్కసారిగా పెద్దకొట్టాల గ్రామాన్ని చుట్టుముట్టారు. అనంతరం ఫోన్ లో చెప్పిన ప్రకారం సదరు ఇంటిలోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు.పోలీసులు, రెవిన్యూ అధికారులు సడెన్ గా ఊరిలోకి వచ్చేయడంతో గ్రామస్తులు వొక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. సదరు ఇంటితో పాటు చుట్టుపక్కల అన్ని ఇళ్లలోనూ అధికారులు చాలాసేపు తనిఖీలు చేపట్టి ఏమీ లేదని తేల్చారు.

ఈ ప్రాంక్ కాల్ కారణంగా తమ పనులను వదిలేసుకుని రావాల్సి వచ్చిందనీ, అనవసరంగా ప్రజాధనం వృథా అయిందని వ్యాఖ్యానించారు. ఈ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకుంటామనీ, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.





Untitled Document
Advertisements