హైదరాబాద్, డిసెంబర్ 11: సకల జనులు నిండుగా దీవించి ఇచ్చిన విజయం ఇది అని, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలంగాణ కేర్ టేకర్ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని, శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. గెలుపుతో అహంకారం రావొద్దని, ప్రజల తీర్పు మేరకు కర్తవ్య నిష్ఠతో పని చేయాలని సూచించారు. విజయం ఎంత ఘనంగా ఉందో, బాధ్యత కూడా అంత బరువుగా ఉందని అన్నారు. సమయం వృధా కాకుండా కష్టించి పనిచేయాలని, ప్రజల ఆకాంక్ష మేరకు కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతామని అన్నారు.