హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గమైన సిరిసిల్లలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి కేటీఆర్కు రికార్డు స్థాయిలో 89,009 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ తనను గెలిపించిన సిరిసిల్ల వాసులకు ధన్యవాదాలు తెలిపారు. ‘నా నియోజకవర్గమైన సిరిసిల్ల 88,886 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించింది. ఇది నాకు అత్యధిక మెజార్టీ. నాకు చేతనైనంతగా నా ప్రజల కోసం సేవచేస్తాను’ అని మొదట ఒక ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటి తర్వాత కేటీఆర్ మరో ట్వీట్ పెట్టారు. ‘నాకు 89,009 ఓట్ల మెజార్టీ వచ్చినట్లు ఇప్పుడే తెలిసింది’ అని హర్షం వ్యక్తం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ అభ్యర్థి కె.కె మహేందర్రెడ్డిపై కేటీఆర్ విజయకేతనం ఎగురవేశారు. 2009 నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతున్న కేటీఆర్.. 2014 ఎన్నికల్లోనూ సిరిసిల్ల నుంచే గెలుపొందారు.