హైదరాబాద్ , డిసెంబర్ 12 : నిన్న శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్ళి గవర్నర్ నరసింహన్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ సంసిద్దతను తెలియజేశారు. ఆ తరువాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబి రాధాకృష్ణన్ కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈరోజు ఉదయం తెలంగాణ భవన్లో తెరాస శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. దానిలో కేసీఆర్ను తెరాస ఎల్పీపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకొంటారు. ఈసారి మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై కేసీఆర్ నిన్న రాత్రే జాబితాను సిద్దం చేసుకొన్నట్లు సమాచారం. అదేవిధంగా మాజీ స్పీకర్ మధుసూధనాచారి శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినందున ఆయన స్థానంలో వేరేవారి పేరును కూడా ఖరారు చేసి ఉండవచ్చు. కనుక శాసన సభాపక్ష సమావేశం ముగియగానే కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా రాజ్ భవన్ కు వెళతారని సమాచారం. గవర్నర్ నరసింహన్ వారిచేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. తెరాస ఘన విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం తెలంగాణభవన్లో తెరాస ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, తెరాస నేతలకు, మీడియా ప్రతినిధులకు కేసీఆర్ విందు భోజనం ఏర్పాటు చేస్తున్నారు.