హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన గులాబీ దళపతి, తాజా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రమాణ స్వీకారానికి ముందు మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. అయితే, అదే సమయంలో ఆయన పలు సంచలన విషయాలు పంచుకున్నారు. ఎమ్మెల్యేలు, జర్నలిస్టులతో కలిసి లంచ్ చేసిన కేసీఆర్ ఈ సందర్భంగా ముచ్చటిస్తూ తాము గెలునాల్సింది 88 కాదు 106 స్థానాలు అని పేర్కొన్నారు.కొద్దిపాటి లోపాల వల్ల కొన్ని సీట్లు కోల్పోయామన్నారు. గవర్నర్ దగ్గర తనతో పాటు మరొక్కరు ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తనకు ఈ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళే కాదు ఓడిన వాళ్లు కూడా ముఖ్యమన్నారు. ఓడిన వాళ్లను తాను కలసి మాట్లాడత అన్నారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో సమావేశం గురించి కేసీఆర్ మాట్లాడుతూ... అసదుద్దీన్, తాను జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకున్నామన్నారు. తెలంగాణ ఇస్తే.. తెరాస పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చేసిన ప్రకటన గురించి విలేకరులు అడగగా కేసీఆర్ స్పందిస్తూ తాను ఆ ప్రతిపాదన పెట్టిన మాట నిజమే అన్నారు. కానీ, పార్టీని విలీనం చేస్తే తనను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించాలని సోనియాగాంధీని కోరినట్లు కేసీఆర్ తెలిపారు. అయితే, తన వినతికి ఆమె దగ్గర నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో... విలీనం చేయలేదన్నారు.