హైదరాబాద్, జనవరి 5: మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాతో బాలీవుడ్ భామ కైరా అద్వాని తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమా మంచి హిట్ సాధించడంతో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆమె ఎంత మాత్రం తొందరపడకుండగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ మాత్రమే అంగీకరించింది. ఆ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వుంది. తాజా ఇంటర్వ్యూలో కైరా అద్వాని మాట్లాడుతూ .. "నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం .. 'వినయ విధేయ రామ'లో నటనతో పాటు డాన్స్ కి అవకాశం వున్న పాత్ర లభించడం నా అదృష్టం. ప్రస్తుతం హిందీలో 'కబీర్ సింగ్' సినిమా చేస్తున్నాను .. ఇది 'అర్జున్ రెడ్డి'కి రీమేక్. 'కబీర్ సింగ్' సినిమా కోసమే నేను 'అర్జున్ రెడ్డి' చూశాను. అప్పటి నుంచి విజయ్ దేవరకొండ అభిమానిగా మారిపోయాను. చాలామందికి లాగే నేను విజయ్ దేవరకొండకి పెద్ద ఫ్యాన్ ని. మహేశ్ .. చరణ్ లతో సినిమాలు చేయడం వలన వాళ్ల ఫ్యామిలీస్ తో బాగా పరిచయం ఏర్పడింది. హైదరాబాద్ లో షూటింగ్ ఉంటే, వాళ్ల ఇంటి భోజనమే చేస్తాను" అని చెప్పుకొచ్చింది.