ముంబై, జనవరి 7: ఈ మద్యే రణ్ వీర్ సింగ్ .. దీపిక పదుకొనె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళి తరువాత ఈ జంట వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారో అని అంతా అనుకున్నారు. ఆ సందర్భం చాలా త్వరగానే వచ్చే అవకాశం ఉందనే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తోంది. హిందీలో కపిల్ దేవ్ బయోపిక్ ను తెరపైకి తీసుకెళ్లడానికి దర్శకుడు కబీర్ ఖాన్ సన్నాహాలు చేస్తున్నాడు. 1983లో టీం ఇండియా ప్రపంచ కప్ సాధించడంలో కపిల్ దేవ్ ప్రధాన పాత్రను పోషించారు. ఆ విజయాన్ని ప్రధాన అంశంగా తీసుకుని ఆయన బయోపిక్ ను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి '83' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్ర కోసం రణ్ వీర్ ను ఎంపిక చేసుకున్నారు. కపిల్ దేవ్ భార్య 'రోమి భాటియా' పాత్ర కోసం దీపికను సంప్రదిస్తున్నారని సమాచారం. కపిల్ విజయసారథిగా నిలిచిన ఆ సమయంలో ఆయన శ్రీమతి స్టేడియంలోనే ఉన్నారు. విజయం సాధించాక ఆమె ఎంతో భావోద్వేగానికి లోనయ్యారట. ఆ పాత్రలో దీపిక అయితేనే కరెక్ట్ అని చర్చలు జరుపుతున్నారు. ఆమె ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ మరింత పెరిగిపోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు.