మేడ్చెల్, జనవరి 8: జిల్లాలోని ఘాట్ కేసర్ మండంలో ఇద్దరు యువకులు అక్రమంగా పాములను అమ్మడానికి ప్రయత్నిస్తూ అటవీ శాఖ అధికారులకు దొరికారు. వివారాల ప్రకారం ఘట్కేసర్ మండలం చౌదర్గూడలోని వెంకటాద్రి టౌన్షిప్లో నివాసముంటున్న షారన్మోసెస్ అనే వ్యక్తి గత నెల రోజులుగా రెండు పాములను పట్టుకుని వాటిని అక్రమంగా భద్రపరిచాడు. ఇందులో ఒకటి కొండచిలువ కాగా, మరొకటి మనుపాము అనే అరుదైన సర్పం. వీటి ద్వారా డబ్బులు సంపాదించాలని భావించిన మోసెస్ అదే గ్రామానికి చెందిన మిత్రుడు ప్రవీణ్తో చెప్పాడు.
ఈ ప్రతిపాదన నచ్చిన ప్రవీణ్ కొండచిలువను మెడలో వేసుకుని ఫోటో దిగాడు. అనంతరం ఆ ఫోటోలను ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఈ పాములు కావాలంటే సంప్రదించాలని చెప్పాడు. ఈ పోస్ట్ వైరల్గా మారి చివరికి అటవీశాఖ అధికారుల కంటపడింది. సోమవారం ఇద్దరు యువకుల ఇళ్లపై దాడి చేసి రెండు పాములను స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.