అమరావతి, జనవరి 8: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న సీనియర్ నేత ఆదిశేషగిరి రావు ఘట్టమనేని తన పార్టీకి రాజీనామా చేశారు. కొన్ని కారణాల వల్ల తాను పార్టీలో ఇమడలేకపోతున్నట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు. అయితే, ఆయన పార్టీ నుంచి వైదొలగాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దాంతో పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారన్నారు. కాగా త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
ఆదిశేషగిరి రావు వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే.. వైసీపీ అధినేత జగన్ ఆయనను విజయవాడ ఎంపీగా పోటీచేయాలని ప్రతిపాదించారు. దీంతో మనస్థాపానికి గురై పార్టీ వీడారు. తన సోదరుడు సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు జయదేవ్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయినా, బంధుత్వాన్ని పక్కనపెట్టి మరీ వైసీపీ విజయానికి 2014లో ఆయన కృషి చేశారు.