అమరావతి, జనవరి 8: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ నేత తలశిల రఘురాం ఆరోపించారు. జగన్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ఎన్నో అవరోధాలు సృష్టించిందని.. ఆఖరికి భౌతిక దాడి కూడా చేయించిందని ఆయన అన్నారు. అయినా వాటన్నింటనీ తట్టుకొని జగన్ తన పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారన్నారు. ఇప్పుడు చంద్రబాబు మరో కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
జగన్ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బుధవారంతో జగన్ పాదయాత్ర ముగుస్తుందన్నారు. పాదయాత్ర అనంతరం తిరుమలలో స్వామి దర్శనానికి జగన్ వెళతారని చెప్పారు. అక్కడ జగన్ పై దాడి చేయించేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని.. తమకు ఈ విషయంలో సమాచారం అందిందని తెలిపారు. స్వామివారిని కూడా రాజకీయాల అవసరాల కోసం వాడుకోవడం చంద్రబాబుకి బాగా తెలుసునని విమర్శించారు.