విశాఖపట్నం, జనవరి 8: వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిపై విచారించేందుకు కేంద్రం ఈ కేసుని ఎన్ఐఎ కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఎన్ఐఎ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించేందుకు వెనుకడుగెయ్యడంతో ఎన్ఐఎ కోర్టును ఆశ్రయించింది. జగన్ మీద జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇప్పించాలని ఎన్ఐఏ కోర్టులో మెమో దాఖలు చేసింది. జగన్ మీద జరిగిన దాడి కేసును విజయవాడ కోర్టుకు బదలాయించాలని కూడా ఎన్ఐఎ కోరింది. నిందితుడు శ్రీనివాసరావును కూడా కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖ విమానాశ్రయంలో నిరుడు అక్టోబర్ 25న జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఎకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎన్ఐఎ జనవరి 1న ఎఫ్ఐఆర్ను నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించింది. విచారణలో భాగంగా ఏపీ పోలీసులు సహకరించకపోవడంతో ఎన్ఐఏ అధికారులు కోర్టును ఆశ్రయించారు.