హైదరాబాద్, జనవరి 8: మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. ఈ చిత్రానికి చిరు తనయుడు చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిరంజీవి ప్రాజెక్టుల గురించి చరణ్ మాట్లాడుతూ .. "ప్రస్తుతం షూటింగు జరుపుకుంటోన్న 'సైరా'మరో రెండు నెలల్లో షూటింగు పూర్తి చేసుకుంటుంది. దసరా సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నామన్నారు. నాన్నగారి తరువాత చిత్రం (152వ సినిమా) కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో వున్నాము.
ఇంకా ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో అనుకున్న ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుంది" అని చెప్పాడు. మొత్తానికి చిరంజీవికి సంబంధించిన ప్రాజెక్టులపై చరణ్ పూర్తి క్లారిటీతో ఉన్నాడనే విషయం అర్థమవుతోంది. కాగా రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.