ముంబై, జనవరి 9: క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ ముందుగానే ప్రారంభం అవుతుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ రెండు వారాల ముందుకు జరిపింది. అంతేకాకుండా 12వ సీజన్ ఐపీఎల్ను భారత్లోనే నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా టోర్నీని యూఏఈ లేదా దక్షిణాఫ్రికాకు తరలిస్తారని ప్రచారం జరిగింది. కానీ భారత్లోనే టోర్నీ నిర్వహించాలని తాజాగా బీసీసీఐ నిర్ణయించింది. గత సీజన్ను ఏప్రిల్ 7 నుంచి ప్రారంభించగా.. ఈసారి అంతకు ముందే ఈ క్యాష్ రిచ్ లీగ్ను ఆరంభించనుంది. మార్చి 23 నుంచి ఐపీఎల్ మ్యాచ్లను ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
ఐపీఎల్ వేదికల విషయమై చర్చించేందుకు సుప్రీం కోర్టు నియమిత క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) మంగళవారం న్యూఢిల్లీలో సమావేశం అయ్యింది. వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు ఐపీఎల్తో ముడిపడిన అన్ని వర్గాలతో చర్చించాక ఐపీఎల్ 2019 పూర్తి షెడ్యూల్ను వెల్లడిస్తాం. ఈసారి ప్రతి వేదికకు ప్రత్యామ్నాయ వేదికనూ సిద్ధంగా ఉంచుతాం. ఎన్నికలు, రీకౌంటింగ్ లేదా ప్రధానమంత్రి ర్యాలీ ఇలా ఏదైనా కారణంతో హఠాత్తుగా మ్యాచ్ను తరలించాల్సి వస్తే, మరో వేదికలో మ్యాచ్ను నిర్వహిస్తాం. దేశంలో వివిధ దశల్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి, ఐపీఎల్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు’’ అని వినోద్ రాయ్ వివరించాడు. ఇక గతంలో 2009, 2014లో ఎన్నికల సందర్భంగా ఐపీఎల్ను దక్షిణాఫ్రికా, యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి కూడా విదేశాల్లోనే ఐపీఎల్ నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ బీసీసీఐ భారత్లోనే నిర్వహిస్తామని ప్రకటించి క్రికెట్ అభిమానులకు శుభావార్తను అందించింది.