బెంగళూరు, జనవరి 9: ప్రతి సంవత్సరం జనవరి నెలలో నిర్వహించే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్– 4) చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ హంటర్స్కు 3–4తో ఢిల్లీ డాషర్స్ చేతిలో ఓటమి ఎదురైంది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న హంటర్స్ 24 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. అవద్ వారియర్స్ 25 పాయింట్లతో అగ్ర స్థానం పొందింది. ఢిల్లీకి ఇది టోర్నీలో తొలి విజయం.
పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్లో ప్రణయ్ (ఢిల్లీ) 15–10, 9–15, 15–12తో రాహుల్ యాదవ్పై గెలుపొందగా, డాషర్స్ ‘ట్రంప్’ అయిన పురుషుల డబుల్స్లో చయ్ బియావో–జొంగ్జిత్ ద్వయం 8–15, 15–9, 15–8తో అరుణ్–ఇసారా (హైదరాబాద్) జంటపై నెగ్గింది. దీంతో ఢిల్లీ 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ను హంటర్స్ ‘ట్రంప్’ మ్యాచ్గా ఎంచుకోగా సింధు 15–11, 15–9తో కొసెట్స్కయా (ఢిల్లీ)పై విజయం సాధించింది. రెండో పురుషుల సింగిల్స్లో సుగియార్తో (ఢిల్లీ) 15–6, 15–11తో గాల్జౌను ఓడించడంతో 4–2తో డాషర్స్ విజయం ఖాయమైంది. మిక్స్డ్ డబుల్స్లో కిమ్ స రంగ్–ఇయోమ్ (హైదరాబాద్) జంట 15–7, 15–12తో వాంగ్ సిజి– చియా సిన్ లీ జోడీపై గెలిచింది. తరువాత జరిగిన రెండో మ్యాచ్లో అవధ్ వారియర్స్ 5–0తో నార్త్ ఈస్ట్రన్ వారియర్స్పై జయభేరి మోగించింది. నేడు జరిగే మ్యాచ్లో బెంగళూరు రాప్టర్స్తో చెన్నై స్మాషర్స్ ఆడుతుంది.