న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: చెన్నై విమానాశ్రయం నిఘా సిబ్బంది శనివారం ఉదయం దిమ్మతిరిగిపోయే షాక్కు గురయ్యారు. బ్యాంకాక్ నుండి వస్తున్న వొక ప్రయాణికుడి బ్యాగును అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. బాగ్ చెక్ చేస్తున్న సమయంలో నెలన్నర వయసు ఉన్న చిరుత పులి పిల్ల బయటపడింది. భద్రతా సిబ్బంది దానిని ఓ తువ్వాలులో చుట్టి సీసాతో పాలు పట్టిస్తున్నారు.
ఈ క్రమంలో ఎయిర్పోర్టు ఇంటిలెజిన్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకొని, అనంతరం చెన్నైలోని ఆరినగర్ అన్నా జువాలాజికల్ పార్కుకు తరలించారు. చిరుతను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమిళనాడు అటవీ విభాగం అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు. వన్యప్రాణులను తరలించడం చట్టవిరుద్ధం. పైగా నిందితుడైన ప్రయాణికుడు చిరుత కూన ప్రాణాలకు హానికలిగే విధంగా దానిని బ్యాగులో దాచి తరలించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.