అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం

     Written by : smtv Desk | Sun, Feb 03, 2019, 11:35 AM

అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం

అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నేలపాడులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతంకానుంది. మరికొద్ది గంటల్లో నేలపాడులోని న్యాయనగరంలో నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రారంభించనున్నారు. ఈ భవనాన్ని సీఆర్డీఏ ఎనిమిది నెలల కాలంలో పూర్తి శాండ్ స్టోన్ తో నిర్మించారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన శాండ్‌స్టోన్‌తో తాపడం చేశారు. దీంతో అందర్నీ ఆకర్షిస్తోంది హైకోర్టు భవనం. అత్యాధునిక వసతులతో, ఆకర్షణీయంగా భవనాలను నిర్మించారు. ఈ జుడీషియల్ కాంప్లెక్స్‌లోనే ఏపీ హైకోర్టును ఏర్పాటు చేశారు సీఆర్డీఏ అధికారులు.

ఈ భవనాలను భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ భవనం పక్కనే శాశ్వత హైకోర్టు భవనానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. శాశ్వత భవనం పూర్తయ్యాక తాత్కాలిక హైకోర్టు అందులోకి తరలించనున్నారు. ప్రస్తుత హైకోర్టులో సిటీ సివిల్‌ కోర్టులు, ట్రైబ్యునళ్లుగా వినియోగించనున్నారు. ఈ హైకోర్టు భవనాల నిర్మాణానికి రూ.173 కోట్లు వెచ్చించినట్లు సీఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. ఇకపోతే రంజన్ గొగోయ్ పర్యటన సందర్భంగా అమరావతిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.





Untitled Document
Advertisements