అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత హైకోర్టు నిర్మాణానికి సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అమరావతిలో నిర్మించనున్న హైకోర్టుకు భూమి పూజను నిర్వహించారు. హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి హైకోర్టు నుండి జనవరి 1న విడిపోయిన ఏపీ ఇప్పుడు కొత్త హైకోర్టు నిర్మాణానికి సిద్దమైంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 450 ఎకరాల్లో రూ. 820 కోట్ల ఖర్చుతో 12.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోతున్నారు. ఈ హైకోర్టు శాశ్వత భవనాన్ని బౌద్ధ స్ఫూపాకృతిలో నిర్మించనున్నారు.