ఫిబ్రవరి 08: గురువారం ఫిఫా ర్యాంకులను ప్రకటించింది. అయితే ఈ ర్యాంకింగ్స్ లో భారత్ కు నిరాశే మిగిలింది. భారత పుట్ బాల్ జట్టు టాప్-100లో చోటు కోల్పోయింది. ఆరు స్థానాలు దిగజారి 103వ ర్యాంక్లో నిలిచింది. దీంతో పాటు ఆసియా ర్యాంకింగ్స్లో కూడా భారత్ 18వ స్థానానికి పడిపోయింది. ఇటీవల జరిగిన ఆసియా కప్లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో యూఏఈ, బహ్రెయిన్ల చేతుల్లో ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఓటమే భారత ర్యాంకు దిగజారడానికి కారణమైంది.
అయితే, 2022 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో పాల్గొనేందుకు భారత పుట్ బాల్ జట్టు తన ర్యాంకుని మరింతగా మెరుగు పరచుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో పెద్ద జట్లతో భారత్ ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడనుంది. 21 ఏళ్ల తర్వాత 2017లో తొలిసారి టాప్-100లో చోటు దక్కించుకుంది. ఫిఫా ర్యాంకింగ్స్లో భారత పుట్ బాల్ జట్టు అత్యుత్తమ ర్యాంకు 94గా ఉంది. దీనిని ఫిబ్రవరి 1996లో భారత్ దక్కించుకుంది.