న్యూఢిల్లీ, ఫిబ్రవరి 09: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా నేడు మరోసారి ఈడీ ముందు హాజరు కానున్నారు. ఇప్పటికే వాద్రా ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో రెండు సార్లు హాజరైన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు మరోసారి వాద్రా ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు.
మనీ ల్యాండరింగ్, అక్రమాస్తులకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన విచారణలో 40 ప్రశ్నలను రాతపూర్వక సమాధానాలు సేకరించారు. వాద్రాను ఒక రూమ్ లో విచారించగా, మరో రూమ్ లో ఆయన అడ్వకేట్ ను కూర్చోబెట్టారు. ఆయన విచారణకు రావడం ఇదే తొలిసారి. వాద్రాకు తోడుగా ప్రియాంక కూడా ఈడీ కార్యాలయం వరకు వచ్చారు.
ఈడీ జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఐదుగురు ఇతర అధికారులు వాద్రాను ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీలు, లండన్లో వాద్రా కొనుగోలు చేసిన, ఆయన అధీనంలో ఉన్న కొన్ని స్థిరాస్తులు తదితరాలపై వాద్రాను నగదు హవాలా నియంత్రణ చట్టం కింద విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని అంతకుముందు అధికార వర్గాలు తెలిపాయి.
వాద్రా ఈడీతో మాట్లాడుతూ, తనకు విదేశాల్లో ఎలాంటి అక్రమాస్తులూ లేవనీ, రాజకీయ కుట్రతోనే ఇదంతా జరుగుతోందని వాద్రా అంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను వెంటాడి వేధిస్తున్నారని పేర్కొన్నారు.