న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: శారద చిట్ఫంట్ కుంభకోణం కేసులో కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్కుమార్, టీఎంసీ ఎంపీ కునాల్ ఘోష్ వరుసగా రెండో రోజు ఆదివారం సీబీఐ ఎదట హాజరయ్యారు. మొదటగా వీరిని వేరువేరు గదులలో విచారించగా, తరువాత ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.
చిట్ఫండ్ కుంభకోణంపై విచారణకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సిట్కు రాజీవ్కుమార్ను ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఆ కుంభకోణానికి సంభందించిన కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు రాజీవ్కుమార్ ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శారదా కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది.
ఈ సందర్భంగా సీబీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, 'సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజీవ్ కుమార్ను రెండో రోజు విచారించామని తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు మొదలైన విచారణ రాత్రి ముగిసిందన్నారు. తన విచారణను వీడియో తీయాలన్న రాజీవ్కుమార్ విజ్ఞప్తిని సీబీఐ తిరస్కరించిందని వెల్లడించారు.
కస్టోడియల్ విచారణ సందర్భంగా మాత్రమే వీడియో రికార్డింగ్ చేస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్నం వరకూ రాజీవ్ కుమార్, ఘోష్ను వేర్వేరు గదుల్లో విచారించామనీ, ఆతర్వాత మాత్రం ఇద్దరిని ఒకే గదిలో కూర్చోబెట్టి విచారణ సాగించామని పేర్కొన్నారు'.
మరోవైపు షిల్లాంగ్లోని సరస్వతీదేవి ఆలయంలో పూజలు చేసిన తరువాత కునాల్ ఘోష్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కునాల్ మీడియాతో మాట్లాడుతూ, 'ఈ విషయంలో నేను ఎలాంటి కామెంట్లు చేయదల్చుకోలేదు. మొదటినుంచి నేను సీబీఐ అధికారులకు సహకరిస్తున్నా.
అందులో భాగంగానే ఈరోజు విచారణకు హాజరయ్యా' అని తెలిపారు. శారదా కుంభకోణానికి సంబంధించి 2013లో కునాల్ ఘోష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తరువాత కొద్దికాలానికే ఆయన బెయిల్పై విడుదలయ్యారు.