హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఇంకో నాలుగు నెలల్లో సిద్ధిపేటలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో తన్నీరు హరీష్ రావు భార్య శ్రీనిత పాల్గొననున్నారు. కేసీఆర్ అన్న కుమార్తె అయిన శ్రీనిత బరిలోకి దిగడం ద్వారా రాజకీయాల్లోకి వస్తారని, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్ రమ్యారావు ఆసక్తికర పోస్టును పెట్టారు.
కాంగ్రెస్ కు చెందిన వాట్స్ యాప్ గ్రూప్ లో 'తాజా తెలంగాణ' అనే శీర్షికతో ఆమె ఈ పోస్ట్ పెట్టారు. 'మరో 4 నెలల్లో సిద్ధిపేటకు బై ఎలక్షన్. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న తన్నీరు శ్రీనిత' అని ఆమె అన్నారు. సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
హరీశ్ రావును పార్లమెంట్ కు పంపాలని కేసీఆర్ భావిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రమ్యారావు పోస్టుకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఆమె పోస్టుపై ఇప్పుడు తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది.