హైదరాబాద్, ఫిబ్రవరి 11: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 22న ఓటర్ ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం రాజకీయ పార్టీలతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఓటర్ లిస్ట్ రివిజన్ జరుగుతోందని, ఈ నెల 22న ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తామని తెలిపారు. 2019 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదుకు అర్హులని తెలిపారు.
11వ తేదీలోపు వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నాటికి ఫామ్ 6 దరఖాస్తులు 1,74,966, ఫామ్7-1,455, ఫామ్8-10,371, ఫామ్ 8ఏ-2,074 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 28,500 లకు పైగా ఓట్లు తొలగించామని సోమవారం వీటి పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.
రేపటి ఉంచి ఈవీఎంలకు ఫస్ట్ లెవల్ చెకింగ్ ఉంటుందని ఈ అంశాన్ని రాజకీయ పార్టీలకు తెలియజేశామన్నారు. కేసు ఉన్న ఈవీఎంలు మినహా మిగిలిన అన్ని ఈవీఎంలను తనిఖీ చేసినట్లు, అందుకోసం ముగ్గురు నోడల్ అధికారులను నియమించామని తెలిపారు.
సమగ్ర ఓటర్ జాబితాను తయారు చేసేందుకు గతంలో తొలగించిన ఓట్లను పరిశీలించి జాబితా రూపొందిస్తామని వివరించారు. నాంపల్లి ఓటర్ జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యం వహించిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.