మండ్య, ఫిబ్రవరి 11: తన రాజకీయ ప్రవేశం కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతుందని సుమలత అంబరీశ్ స్పష్టం చేశారు. సమయం వస్తే మండ్య లోక్సభ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ఆమె తెలిపారు.
ఆదివారం కుమారుడు అభిషేక్తో కలసి నాగమంగళ తాలూకా ఆదిచుంచనగిరిలోని శ్రీక్షేత్రాన్ని సందర్శించుకొని కాలభైరేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన అనంతరం సుమలత మీడియాతో మాట్లాడారు. అంబరీశ్ దూరమైన విషాదం నుంచి తాము ఇంకా పూర్తిగా కోలుకోకముందే తమ గురించి రాజకీయ చర్చలు జరుగుతాయని ఊహించలేదన్నారు.
అయితే మండ్య జిల్లా ప్రజలు, అభిమానుల ఒత్తిడి మేరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని, దీనిపై సన్నిహితులు, రాజకీయ సలహాదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము ఎప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించినా మండ్య నుంచేనని ఆమె స్పష్టం చేశారు.