న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయ భద్రత కల్పించే పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కాంగ్రెస్ ప్రకటించిన ఈ 'కనీస ఆదాయ పథకం' అమలు కష్టమే అని అన్నారు.
ఇది కూడా 'గరీభీ హఠావో' లాంటిదే అని, దీనిని అమలు చేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు. అమలు చేసేంత వెసులుబాటు భారత్ వద్ద లేదని, దానిని ఎలా అమలు చేస్తారో చెప్పాలని కాంగ్రెస్ను అడిగారు.
'కనీస ఆదాయ పథకం' పథకాని సమర్థించబోనని పేర్కొన్న రాజీవ్ కుమార్, సామాజిక భద్రతకు ప్రోత్సాహకాలు ఇవ్వడంకంటే వారికి ఉపాధి కల్పించడమే మంచిదని సూచించారు. చైనా వంటి ప్రముఖ దేశాలు ఈ విషయంలో ముందడుగు వేశాయన్నారు. రాహుల్ కనీస ఆదాయ పథకాన్ని విమర్శించిన రాజీవ్ కుమార్, ప్రధాని మోదీ ప్రకటించిన 'పీఎం కిసాన్ నిధి సమ్మాన్ యోజన' ను మాత్రం ప్రశంసించారు.