న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : దేశ రాజధానిలో ఏపీ భవన్ సమీపంలో నిన్న రాత్రి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. మృతుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. కాగా ఆర్థిక ఇబ్బందులు కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
ఈ విషయంపై పోలీస్ అధికారి మాధుర్ వర్మ సోమవారం ఇక్కడ మాట్లాడుతూ..."ఢిల్లీ ఏపీ భవన్ సమీపంలో వ్యక్తి మృతి చెందిన సమాచారాన్ని అక్కడ సిబ్బంది సమాచారం అందించారు. మృతదేహం పక్కన రూ. 20 నోటుతో పాటు ఓ చిన్న బాటిల్ ఉంది.
పురుగుల మందు తాగి చనిపోయినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించాం. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించాం" అని తెలిపారు.