టీ20 సిరిస్ ఓటమి నిరాశను కలిగించిందని భారత తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. హామిల్టన్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో 213 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆఖరి బంతి వరకూ పోరాడినా 208/6కే పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడు టీ20ల సిరిస్ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది. దాంతో న్యూజిలాండ్లో తొలిసారి టీ20 సిరీస్ సాధించాలనుకున్న భారత్ ఆశలు తీరలేదు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ "టీ20 సిరీస్ ఓటమి నిరాశ కలిగించింది. 213 పరుగుల లక్ష్యం చాలా కష్టమే. కానీ.. ఆఖరి ఓవర్ వరకూ భారత్ జట్టు గెలుపు అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంటూ వచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లు ఒత్తిడిని చక్కగా అధిగమించి.. చివర్లో వరుసగా యార్కర్లు వేయగలిగారు. కివీస్ పర్యటనని వన్డే సిరీస్ విజయంతో భారత్ జట్టు మెరుగ్గానే ఆరంభించింది" అని అన్నాడు.