న్యూడిల్లీ, ఫిబ్రవరి 12: న్యూజిలాండ్ తో జరిగిన ఆఖరి టీ 20 మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్ లోకి పరుగెత్తుకొచ్చిన ధోనీ అభిమాని అతని కాళ్ళకి నమస్కారం చేయబోతుండగా అభిమాని చేతిలోని జాతీయ పతాకం నేలని తాకబోతుండగా ధోనీ దాన్ని చేతిలోకి తీసుకోవడంతో ధోనీ దేశభక్తి ప్రపంచమంతా తెలిసింది. దీంతో ధోనీ పై ప్రశంసల వర్షం కురిసింది.
ధోనీ చదువుకున్న జవహర్ విద్యా మందిర్ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్, ధోనీ చిన్ననాటి గురువు ఏకే సింగ్ ధోనీ దేశభక్తి గురించి మాట్లాడుతూ ధోనీ రేపటి యువతకు ఎంతో ఆదర్శమని, అతనిని చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు. దేశభక్తికి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడని ఆయన ప్రశంసించారు. ధోనీ కోట్లాది మంది హృదయాలను గెలవడమే కాకుండా దేశం పౌరుల మనోభావాలను కాపాడాడని ఆయన అన్నారు. ధోనీకి గురువుని కావడం తన అదృష్టమని, ఒక గురువుకి ఇంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుందని ఆయన పేర్కొన్నారు.