హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఇండియా టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో తన కెరీర్ అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. సోమవారం ఏటిఏ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో ప్రజ్నేశ్ వందలోపు ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఒక్కసారిగా ఆరు స్థానాలు ఎగబాకి ప్రజ్నేశ్ 97 స్థానంలో నిలిచాడు. ఫలితంగా టాప్-100లోపు ర్యాంకును అతని కెరీర్లో తొలిసారి నమోదు చేశాడు. కాగా, గత పదేళ్లలో ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో వందలోపు ర్యాంకును సాధించిన మూడో ఇండియా ఆటగాడిగా అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు సోమ్దేవ్ దేవ్వర్మన్, యూకీ బాంబ్రీలు వందలోపు ర్యాంక్ సాధించిన భారత ఆటగాళ్లు. రామ్కుమార్ రామ్నాథన్ ఐదు స్థానాలు ఎగబాకి 128 స్థానంలో, యూకీ బాంబ్రీ 156వ స్థానంలో నిలిచారు.