న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వల్ల అవినీతిపరులకు ఎంతో సమస్య ఉందన్నారు. దేశంలో అవినీతిని అంతం చేసేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. మోదీని నిజాయితీపరులు మాత్రం కాపలా దారు గా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి దేశాన్ని శుద్దిగా మార్చడంలో ముందున్నామని తెలిపారు. మంగళవారం గ్రామీణ మహిళల నాయకత్వ పాత్రను గుర్తించే కార్యక్రమం స్వచ్ఛ్శక్తి-2019 కురుక్షేత్రలో జరిగింది.
ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ప్రస్తుతం హర్యానాలోని అవినీతిపరులపై జరుగుతున్న దర్యాప్తులతో కొందరు కలవరం చెందుతున్నారన్నారు. ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన మహా కూటమిని కల్తీ కూటమి అని వ్యాఖ్యానించారు. కల్తీ కూటమిలోని నేతలంతా కలిసి కోర్టులను, మోదీని, దర్యాప్తు సంస్థలను దూషించడం, బెదిరించడంలో పోటీలు పడు తున్నారు. కానీ, ఈ చౌకీదారు వారి దూషణలు, బెదిరింపులకు అదరడు బెదరడు, ఆగడు, లొంగడని మీకు తెలుసు. దేశానికి పట్టిన అవినీతి మరకలు, బురదను తొలగించే శుద్ధి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తాం. అందుకు మున్ముందు కూడా మీ ఆశీస్సులు కావాలి అని ప్రధాని కోరారు.