బెంగళూరు, ఫిబ్రవరి 13: కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న శశికళ, త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర జైళ్ల శాఖ నిబంధనల ప్రకారం, స్వల్ప కాల శిక్షకు గురైన వారు మూడోవంతు శిక్షను పూర్తి చేసుకుంటే ఆపై ఎప్పుడైనా విడుదల కావచ్చు. జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ఆమెకు విధించబడగా, శిక్షాకాలం 2021తో పూర్తవుతుంది.
అయితే, సత్ప్రవర్తన, రాష్ట్ర చట్టాల ప్రకారం, ఆమె శిక్షాకాలం ముగియకుండానే బాహ్య ప్రపంచంలోకి వచ్చేస్తారని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఆమెకు జైలుశిక్షతో పాటు రూ. 10 కోట్ల జరిమానాను కూడా సుప్రీంకోర్టు ఖరారు చేసిన నేపథ్యంలో, ఆ జరిమానా డబ్బును శశికళ ఇంతవరకూ కట్టలేదు.
జరిమానా డబ్బు కోసం ఆమె ఆస్తులను జప్తు చేసేందుకు తమిళనాడు సర్కారు ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. శశికళతో పాటు జైలు జీవితాన్ని గడుపుతున్న ఇళవరసి, సుధాకరన్ లు కూడా మూడేళ్ల శిక్షాకాలం పూర్తి కాగానే విడుదలవుతారని సమాచారం.