న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తాజాగా జరిగిన లోక్ సభలో నరేంద్ర మోది మరోసారి ప్రధాన మంత్రి కావాలని ఆయన ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది మరోసారి రుజువైంది. లోక్ సభలో ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. నేను ఎప్పుడు మీ దగ్గరకు వచ్చిన... నా పనులను మీరు ఎప్పటికప్పుడు పరిష్కరించారు' అని అన్నారు. మోదీ ఎన్నో మంచి పనులు చేశారని, ఆయన వైపు ఎవరు వేలెత్తి చూపలేరని తెలిపారు. అలాగే మోది మళ్ళి ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు.
కాగా ములాయం ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో కాంగ్రెస్ నేత సోనియాగాంధీ ఆయన పక్క సీటులోనే ఉండటం గమనార్హం. అయితే, ములాయం చేసిన ఈ వ్యాఖ్యలకు ఆమె చిరునవ్వు నవ్వారు. ములాయం వ్యాఖ్యలతో ఆనందోత్సాహకులైన మోదీ తన రెండు చేతులను ఊపుతూ కృతజ్ఞతలు చెప్పారు. కాగా ములాయం కుమారుడు, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీ వ్యతిరేక కూటమిలో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఉత్తర ప్రదేశ్ లో భాజపాని ఎదుర్కొనేందుకు బీఎస్పీతో కూడా చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.