ఒడిశా, ఫిబ్రవరి 13: రోగులకు చికిత్స సమయంలో నిర్లక్ష్యం రోజురోజుకి మరీ ఎక్కువైపోతోంది. నిన్న కాక మొన్నే హైదరాబాద్లోని నిమ్స్లో వైద్యులు ఓ మహిళ కడుపులో కత్తెర మరిచిపోయారన్న వార్త తెలిసింది, అంతలోపే మరో వింత సంఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మితారాణి జేనా అనే మహిళ ఎడమ కాలుకు ప్రమాదవశాత్తు గాయమైంది.
దీంతో ఆమెను ఆనంద్పూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాలన్నారు. దానికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. వెంటనే జేనాను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. ఆమెకు స్పృహ వచ్చాక చూసుకుంటే డాక్టర్లు ఎడమ కాలుకు కాకుండా.. కుడి కాలుకు ఆపరేషన్ చేశారు.
ఈ ఘటనపై వెంటనే డాక్టర్లను నిలదీయగా.. ఆమె ఎడమ కాలుకు మళ్లీ ఆపరేషన్ చేశారు. తన రెండు కాళ్లకు ఆపరేషన్ జరగడంతో ప్రస్తుతం మితారాణి నడవలేని పరిస్థితిలో ఉంది. నిర్లక్ష్యంతో వ్యవహరించి మితారాణిని నడవకుండా చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె బంధువులు డిమాండ్ చేస్తున్నారు.