హైదరాబాద్, ఫిబ్రవరి 14: తమిళ్ హీరో ఆర్య, హీరోయిన్ సయేషా సైగల్ ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిందే. వీరి ప్రేమ తమిళ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే వీరి పెళ్ళి గురించి ఇప్పుడు అందరికి ఒక స్పష్టత వచ్చేసింది. ఈరోజు ప్రేమికుల రోజు సందర్భంగా సయేషా తన ట్విట్టర్లో వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ .. మార్చిలో తాను ఆర్యని వివాహం చేసుకోబోతున్నట్టు తెలిపింది. మా ఇద్దరికి మీ అందరి అభిమానం, ఆశీర్వాదం కావాలని కూడా కోరింది.
అయితే మార్చి 9,10 తేదీలలో వీరి వివాహం జరగనుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వారి వివాహం ఎప్పుడు జరగబోయేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. హైదరాబాద్లో ఆర్య,సయేషాల పెళ్లి వేడుక జరపనుండగా, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని సమాచారం. వీరిద్దరూ 2018లో వచ్చిన గజినీకాంత్ అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వారిద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆర్య సూర్య-కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కప్పం చిత్రంలో నటిస్తున్నారు.