న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పార్లమెంటులో బుధవారం మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై ప్రసంశల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పక్కన ఉండగానే ములాయం ఇలా వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ శ్రేణులతోపాటు సమాజ్వాదీ పార్టీ శ్రేణులు ఖంగుతిన్నాయి. ఎస్పీ నేతలు కార్యకర్తలు స్పందించి తమ పార్టీ అధినేత అఖిలేష్గాని, ములాయం కాదంటూ మండిపడ్డారు. ములాయం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించడంతో బీజేపీ శ్రేణులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ మాత్రం ఈ విషయాన్నీ అఖిలేష్ కూడా గుర్తించాలని అన్నారు. 'నిజం ఎప్పటికైనా నిజమే. ప్రధాని నరేంద్రమోదీ అందరినీ కలుపుకొని పోతున్నారని, ఆయన మళ్లీ ప్రధాని కావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ నిజం పలికారు. ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ కూడా ఈ వాస్తవాన్ని అంగీకరిస్తే బాగుంటుంది' అని సూచించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్షాలతో జట్టుకట్టిన అఖిలేష్కు ములాయం వ్యాఖ్యలు ఊహించని విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.