జమ్మూ కాశ్మీర్, ఫిబ్రవరి 14: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి భీభత్సం సృష్టించారు. కశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని ఓ పాఠశాలలో బాంబు పేలిన సంఘటనకు 24 గంటలు కూడా ముగియకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అవంతిపోర ప్రాంతంలో సీఆర్పీఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని టార్గెట్ చేశారు ఉగ్రవాదులు. మొదట తుపాకులతో కాల్పులు జరిపి తరువాత శక్తివంతమైన ఐఈడీ బాంబుతో దాడిచేశారు.
ఈ ప్రమాదంలో 12 మంది సీఆర్పీఫ్ జవాన్లు అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని దగ్గరలోని హాస్పిటల్లో చేర్పించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, సీఆర్పీఫ్ జవాన్ల కాన్వాయ్పై దాడి చేసింది తామేనని జైషే ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటిచింది.
సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడ్డామని తెలిపింది. జమ్ముకశ్మీర్ ప్రధాన రహదారిపై నిలిపి ఉంచిన ఓ ఆటోరిక్షాలో ఐఈడీని ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్ కాన్వాయ్ అక్కడికి రాగానే ఆ వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చేశారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ వాహనం ముక్కలు ముక్కలైంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం తొలుత తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని ఆ తర్వాత గ్రనేడ్లతో పేలుళ్లు జరిపినట్లు తెలుస్తోంది.