న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: నిన్న పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై దాడి జరిపిన ఉగ్రవాదులు 44 మందిని బలిగొన్న ఘటనపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, నేడు అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఉదయం 9.30 గంటలకు క్యాబినెట్ భేటీ జరుగనుండగా, పుల్వామా ఉగ్రదాడిపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థను ఇక ఏ మాత్రం ఉపేక్షించరాదని భావిస్తున్న కేంద్రం, ఈ మేరకు ఇతర దేశాల సాయంతో పాకిస్థాన్ పై ఒత్తిడిని పెంచే విషయంపైనా చర్చించనుంది.
ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న విషయంపైనా చర్చ జరుగుతుందని సమాచారం. కాగా, ఉగ్రవాదుల దాడిలో మరో 45 మందికి గాయాలు కాగా, వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.