హైదరాబాద్, ఫిబ్రవరి 15: ప్రేమికుల రోజు సందర్భంగా గురువారం భజరంగ్ దళ్ సంస్థలు ప్రేమికుల వేటలో పడ్డాడు. ప్రేమికుల రోజున కలిసి కనిపిస్తే ప్రేమికులకి పెళ్లి చేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో ఓ ప్రేమ జంటకి బలవంతంగా పెళ్లి చేసారు. మేడ్చల్లో కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో ఓ ప్రేమ జంట తిరుగుతుండగా వాళ్లకు బలవంతంగా పెళ్లి చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే తన కుమార్తెకు పెళ్లి చేయడంపై అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
తన కూతురు సుష్మ తమ బంధువు రాకేశ్ తో ఉండగా వారిని ప్రేమికులుగా భావించిన భజరంగ్ దళ్ కార్యకర్తలు శ్రీహరిచారి, ఆనంద్లు మరికొందరితో కలిసి వారితో అసభ్యంగా ప్రవర్తించారని, అనంతరం ఇద్దరికీ పెళ్లి చేశారని జైపాల్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటన తర్వాత తన కూతురి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందని, తన ఆచూకీ తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేసాడు. వారికి పెళ్లి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.