న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ధీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. కేంద్ర
క్యాబినెట్ సమావేశం ముగిసిన అనతరం మోదీ మాట్లాడుతూ, చాలా పెద్ద తప్పు చేశారని, దానికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు.
"ఉగ్రవాదులు చాలా దారుణానికి పాల్పడ్డారు. పెద్ద తప్పు చేశారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ దాడి వెనుక ఉన్న శక్తులను చట్టం ముందు నిలబెడతాం" అని అన్నారు. ఈ దాడిపై దేశ ప్రజల రక్తం మరుగుతోందని చెప్పారు. భారత్ ను అస్థిరపరచాలని పొరుగు దేశం భావిస్తున్నట్టైతే, ఆ ఆలోచనను విరమించుకోవాలని, అది ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు.
గతంలో పాకిస్తాన్ కు కల్పించిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఉపసంహరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఏకాకిని చేస్తామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక పాకిస్తాన్, ఆ దేశ మద్ధతుదారుల హస్తం ఉందని ఆరోపించారు. పాకిస్తాన్కు సహకరించేవారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు.